మత్తయి 26; లూకా 22; యోహాను 13–14
ప్రభురాత్రి భోజనము
యేసు సంస్కారమును పరిచయం చేస్తారు
యేసు మరియు ఆయన అపొస్తలులు పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేములో ఉన్నారు. యూదా ప్రజలు ప్రతి సంవత్సరం పస్కా పండుగను జరుపుకునేవారు. చాలా సంవత్సరాల క్రితం, వారి కుటుంబాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నాయని, దేవుడు వారిని తప్పించుకోవడానికి సహాయం చేశాడని వారు గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడింది.
నిర్గమకాండము 12:27
వారు యెరూషలేములో ఉన్నప్పుడు, యేసు మరియు ఆయన అపొస్తలులు కలిసి ఒక ప్రత్యేక విందు చేసుకున్నారు. యేసు వారితో ఈ భోజనం పంచుకోవడానికి ఎదురు చూస్తున్నారు.
లూకా 22:7–15
వారు తినడం ముగించిన తర్వాత, యేసు ఒక గిన్నెను నీటితో నింపారు. ఆయన తన అపొస్తలుల పాదాలను కడగడం ప్రారంభించారు.
యోహాను 13:4–5
పేతురు వంతు వచ్చినప్పుడు, యేసు ఇలా ఎందుకు చేస్తున్నాడని అడిగాడు. పాదాలు కడుక్కోవడం సాధారణంగా సేవకులు మాత్రమే చేసే పని.
యోహాను 13:6
వారికి ఒక ఆదర్శంగా ఉండటానికే తాను వారి పాదాలను కడుగుతున్నానని యేసు చెప్పారు. ఆయన వారిని ప్రేమించినట్లే వారు ఒకరినొకరు సేవించుకోవాలని, ప్రేమించాలని ఆయన కోరుకున్నారు. వారు ఇలా చేస్తే, వారు ఆయన శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు.
యోహాను 13:14–16, 34–35
తాను త్వరలోనే చనిపోతానని యేసు తన శిష్యులకు చెప్పారు. పేతురు యేసు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
యోహాను 13:36–38
కానీ కష్టకాలం వస్తుందని యేసుకు తెలుసు. మరుసటి రోజు ఉదయం కోడి కూయక మునుపే, పేతురు తనకు యేసు తెలియదని మూడుసార్లు అంటాడని ఆయన పేతురుతో చెప్పారు.
యోహాను 13:38
తన అపొస్తలులు ఆందోళన చెందుతారని, భయపడతారని యేసుకు తెలుసు. దేవుడు వారికి పరిశుద్ధాత్మను పంపుతాడని ఆయన వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ వారికి ఆదరణనిస్తుంది, వారికి బోధిస్తుంది మరియు యేసు వారికి బోధించిన వాటిని గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడుతుంది. వారు ఆందోళన చెందవద్దని, భయపడవద్దని ఆయన వారికి చెప్పారు. ఆయన ఇలా అన్నారు, “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.”
యోహాను 14:1, 15–16, 26–27
అప్పుడు యేసు తన అపొస్తలులు తనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి చాలా ప్రత్యేకమైన పని చేశారు. ఆయన సంస్కారమును వారికి ఇచ్చారు. మొదట, ఆయన రొట్టెను ఆశీర్వదించి, దానిని ముక్కలుగా చేసి, తన అపొస్తలులకు ఇచ్చారు. వారు రొట్టె తినేటప్పుడు తన శరీరం గురించి ఆలోచించమని యేసు వారికి చెప్పారు. ఆయన వారి కొరకు చనిపోతాడని గుర్తుంచుకోవాలని ఆయన వారిని అడిగారు.
మత్తయి 26:26; లూకా 22:19
తరువాత యేసు ఒక గిన్నెలో ద్రాక్షారసం పోశారు. ఆయన ద్రాక్షారసాన్ని ఆశీర్వదించి, అపొస్తలులతో దానిని త్రాగమని చెప్పారు. వారు ద్రాక్షారసం త్రాగినప్పుడు తన రక్తం గురించి ఆలోచించమని యేసు వారితో చెప్పారు. మనం పశ్చాత్తాపపడి క్షమాపణ పొందేలా, ప్రజలందరి బాధలు మరియు పాపాల కోసం తాను శ్రమపడి, రక్తం చిందించి, మరణిస్తాడని గుర్తుంచుకోవాలని ఆయన వారిని అడిగారు.
మత్తయి 26:27–28; లూకా 22:20
తరువాత యేసు తాను ద్రాక్షావల్లి లాంటివాడని, తన శిష్యులు కొమ్మల లాంటివారని వివరించారు. ఒక కొమ్మ తీగకు అనుసంధానించబడి ఉంటే, అది ఫలాలను ఇస్తుంది. తీగకు అనుసంధానించబడని కొమ్మ చనిపోతుంది మరియు ఫలాలను ఇవ్వదు. తన శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మరియు తన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఎల్లప్పుడూ తనకు దగ్గరగా ఉండాలని యేసు కోరుకున్నారు.
యోహాను 15:4–12
ఈ విషయాలు బోధించిన తర్వాత, యేసు మరియు ఆయన అపొస్తలులు ఒక కీర్తన పాడారు. వారు గెత్సేమనే అనే తోట వైపు నడిచారు.
మత్తయి 26:30.