లేఖన కథలు
యేసు తన అపొస్తలులను ఎంపిక చేయును—“మనుష్యులను పట్టు జాలరులుగా” ఉండటానికి ఆహ్వానం


మత్తయి 10; లూకా 5:1–11; 6:12–16

యేసు తన అపొస్తలులను ఎంపిక చేయును

“మనుష్యులను పట్టు జాలరులుగా” ఉండటానికి ఆహ్వానం

గలిలయ సముద్రం దగ్గర ప్రజలకు బోధిస్తున్న యేసు.

ఒకరోజు, యేసు బోధనను వినడానికి ప్రజలు గలిలయ సముద్రం దగ్గరకు వచ్చారు. వారు తీరమున వింటుండగా యేసు పడవలో నుండి వారికి బోధించారు. ఆ పడవ సీమోను అనే జాలరికి చెందినది.

లూకా 5:1–3

సీమోనుతో మాట్లాడుతున్న యేసు.

యేసు బోధించడం ముగించిన తర్వాత, పడవను సముద్రపు లోతైన ప్రదేశానికి తీసుకెళ్లమని సీమోనును అడిగారు. చేపలు పట్టడానికి నీళ్లలో వల వేయమని ఆయన సీమోనుతో చెప్పారు. రాత్రంతా చేపలు పట్టానని, ఒక్క చేప కూడా దొరకలేదని సీమోను చెప్పాడు. కానీ యేసు అతన్ని అడిగినందున, అతను మళ్ళీ ప్రయత్నిస్తాడు.

లూకా 5:4–5

చాలా చేపలు పట్టుకుంటున్న సీమోను మరియు అతని స్నేహితులు.

సీమోను అతని వల తెగిపోయేంతగా చాలా చేపలు పట్టాడు! అతను మరొక పడవలో ఉన్న తన స్నేహితులను సహాయం కోసం పిలిచాడు. త్వరలోనే పడవలు చేపలతో నిండిపోయాయి, అవి మునిగిపోవడం ప్రారంభించాయి. సీమోను మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు!

లూకా 5:6–7, 9

యేసు యెదుట మోకరించిన సీమోను.

సీమోను యేసు యెదుట మోకరించాడు. “ప్రభువా, నేను పాపాత్ముడను” అని అతను చెప్పాడు. యేసు దేవుని నుండి పంపబడ్డారని అతనికి తెలుసు. భయపడకు అని యేసు అతనికి చెప్పారు.

లూకా 5:8

యేసు సీమోను, అంద్రెయ, యాకోబు, యోహానులను తనను వెంబడించమని ఆహ్వానిస్తున్న యేసు.

యేసు సీమోనును, అతని సోదరుడు అంద్రెయను, అతని స్నేహితులైన యాకోబు, యోహానులను తనను వెంబడించమని ఆహ్వానించారు. చేపలు పట్టే బదులు, ప్రజలు యేసు దగ్గరికి వచ్చేలా వారు సహాయం చేస్తారు.

మార్కు 1:16–17; లూకా 5:10–11.

యేసు తన సంఘాన్ని నడిపించడానికి అపొస్తలులకు తన యాజకత్వ అధికారాన్ని ఇస్తున్నారు.

సీమోను, యాకోబు, యోహానులు తమ చేపలు పట్టే పడవలను విడిచిపెట్టి యేసు యొక్క అపొస్తలులయ్యారు. తరువాత, యేసు సీమోనుకు పేతురు అనే పేరు పెట్టారు. ఒక అపొస్తలుడు యేసు క్రీస్తు యొక్క ప్రత్యేకమైన సాక్షి. యేసు 12 మందిని తన అపొస్తలులుగా పిలిచారు. ఆయన ఎవరిని పిలవాలో తెలుసుకోవడానికి ప్రార్థించారు. యేసు తన సంఘాన్ని నడిపించడానికి అపొస్తలులకు తన యాజకత్వ అధికారాన్ని ఇచ్చారు.

మత్తయి 10; లూకా 6:12–16; 9:1–2

ఒక బిడ్డను స్వస్థపరుస్తున్న అపొస్తలుడు.

అపొస్తలులు దేవుని శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి, వారు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచగలరు, చనిపోయిన తర్వాత వారిని తిరిగి బ్రతికించగలరు మరియు ఇతర అద్భుతాలు చేయగలరు.

మత్తయి 10:8

ఒక జనసమూహానికి బోధిస్తున్న యేసు. కొంతమంది ఆయన బోధనల వలన అసంతృప్తి చెందారు.

ప్రజలకు తన సువార్తను బోధించడానికి యేసు తన అపొస్తలులను అనేక పట్టణాలకు పంపారు. వారు ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ వారికి సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. కొంతమంది తాము బోధించేది ఇష్టపడరని, అయితే వారు నమ్మకంగా సేవ చేసినప్పుడు, దేవుడు వారితో ఉంటారు అని యేసు చెప్పారు.

మత్తయి 10:5–7, 19–22