నిత్యత్వము యొక్క గొప్ప బహుమతులు: యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పునరుత్థానము, పునఃస్థాపన
మనం ఈస్టరులో యేసు క్రీస్తునందు శాంతిని, నిజమైన యేసులాగా మారడాన్ని మరియు చెందియుండడాన్ని కనుగొంటాము—అది శాశ్వతంగా నిజమైనది మరియు ఆనందకరమైనది, సంతోషకరమైనది మరియు ఎప్పటికీ ఉంటుంది.
సంవత్సరాల క్రితం, తెల్లవారుజామున మా సువార్త తరగతిలో బైబిలు వచనాలను కంఠస్థం చేయించేవారు. సహజంగానే నేను చిన్న వచనాల వైపు ఆకర్షించబడ్డాను. ఇందులో యోహాను 11:35 కూడా ఉంది—లేఖనంలోని అతి చిన్న వచనం, కేవలం మూడు పదాలు మాత్రమే—“యేసు కన్నీళ్లు విడిచెను.”
ఇప్పుడు నాకు, యేసు దుఃఖంలోను మరియు ఆనందంలోను కన్నీళ్లు విడిచారు అనేది అద్భుతమైన వాస్తవికతకు సాక్ష్యమిస్తున్నది: దేవుని యొక్క దైవిక కుమారుడు భౌతికంగా మర్త్యత్వంలోకి వచ్చారు మరియు ఎల్లప్పుడూ మనతో ఎలా ఉండాలో, మనల్ని ఎలా ఆశీర్వదించాలో శరీరానుసారంగా నేర్చుకున్నారు.
మనం దుఃఖంలో లేదా ఆనందంలో ఏడ్చినప్పుడు, యేసు క్రీస్తు దానిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. నిత్యత్వపు గొప్ప బహుమతులైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పునరుత్థానము, పునఃస్థాపన మనకు అత్యవసరమైన క్షణాలలో, ఆయన ప్రత్యక్షంగా ఉండగలరు.
మరియ మరియు మార్తలు మరణించిన తమ సోదరుడు లాజరు కోసం కన్నీళ్లు విడిచారు. కనికరముతో కదిలింపబడి, యేసు కన్నీళ్లు విడిచారు. ఆయన లాజరును బ్రతికించారు.
పస్కా పండుగ సందర్భంగా యేసు యెరూషలేమును చూస్తారు. కోడి తన పిల్లలను చేర్చుకొనునట్లు తన జనులను చేర్చుకోలేకపోయినందుకు ఆయన కన్నీళ్లు విడిచారు. జరిగియుండవలసిన దాని గురించి మనం దుఃఖించినప్పుడు, ఆయన ప్రాయశ్చిత్తం నేడు మనకు నిరీక్షణనిస్తుంది.
“నా ఒలీవతోట కొరకు ఇంకను ఎక్కువగా నేను ఏమి చేసియుండవలసినది?” అని ఒలీవతోట యజమాని, పరిచర్య చేసే సహోదర సహోదరీలమైన మనతో సహా తన సేవకులను అడుగుతున్నప్పుడు కన్నీళ్లు విడిచారు.
మరియ సమాధి దగ్గర విగతజీవిగా నిలబడి ఉంది. యేసు సున్నితంగా, “ఎందుకు ఏడ్చుచున్నావు?” అని అడిగారు. “సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును” అని ఆయనకు తెలుసు. పునరుత్థానము అందరికీ అరుణోదయాన్ని తెస్తుంది.
మోర్మన్ గ్రంథ దేశాలలో, విశ్వాసపాత్రులైన జనసమూహం ఆయన వద్దకు వచ్చినప్పుడు, యేసు ఆనందము సంపూర్ణమైంది. ఆయన కన్నీళ్ళు విడిచారు.
“మరియు ఆయన వారి చిన్న పిల్లలను ఒకరి తరువాత ఒకరిని తీసుకొని, వారిని ఆశీర్వదించి, వారి కొరకు తండ్రిని ప్రార్థించారు.
“ఆయన దీనిని చేసినప్పుడు, ఆయన తిరిగి కన్నీళ్ళు విడిచారు.”
ఇదే యేసు క్రీస్తునందు ఈస్టరు: ఆయన మన హృదయాలలో ఉన్న ఆకాంక్షలను తీరుస్తారు మరియు మన ఆత్మకు కలిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఆయన మన ఆనంద భాష్పాలను తప్ప, కన్నీళ్లను తుడిచివేస్తారు.
మన కన్నీళ్లు ప్రవహించినప్పుడు, మనం కొన్నిసార్లు క్షమాపణలు కోరుతాము, ఇబ్బందిపడతాము. అయితే జీవితంలోని బాధలను మరియు ఆనందాలను యేసు క్రీస్తు అర్థం చేసుకుంటారని తెలుసుకోవడం వలన, మనం మంచి చెడులను ఎదుర్కొనేటప్పుడు మన స్వంత శక్తిని మించిన బలాన్ని పొందవచ్చు.
దక్షిణ అమెరికాలో, ఒక తండ్రి శోకం. అతని జీవితంలో ఒక వెలుగైన అతని చిన్న కూతురు చనిపోయింది. “ఆమెను మళ్ళీ చూడడానికి నేను ఏమి కావాలన్నా ఇస్తాను,” అని అతను నన్ను పట్టుకొని ఏడ్చాడు. నేను కూడా ఏడ్చాను.
పుయెబ్లా మెక్సికో దేవాలయ ప్రతిష్ఠాపన సమయంలో, ఒక ప్రియమైన సహోదరి ముఖాన్ని ఆనంద భాష్పాలు తడిపేశాయి. ఆమె ముఖ కవళికలు విశ్వాసాన్ని, త్యాగాన్ని ప్రసరింపజేశాయి. ఆమె ఇలా చెప్పింది, “టోడోస్ మిస్ హిజోస్ ఎస్టాన్ అక్వి ఎన్ ఎల్ టెంప్లో హోయ్”—“నా పిల్లలందరూ ఈ రోజు దేవాలయములో ఉన్నారు.” ప్రభువు యొక్క మందిరములో సమకూడిన తరతరాలు ఆనంద భాష్పాలను మరియు కృతజ్ఞతను తెస్తాయి.
క్రూరమైన అంతర్యుద్ధంలో, కుటుంబాలు మరియు పొరుగువారు ఒకరి పట్ల ఒకరు మాటల్లో చెప్పలేని విధంగా ప్రవర్తించారు. బాధాకరమైన కన్నీళ్లు నెమ్మదిగా నిరీక్షణకు దారితీస్తున్నాయి. ఒక చిన్న గ్రామంలోని మహిళ వణుకుతున్న స్వరముతో ఇలా అంటున్నారు, “పొరుగువాడా, నేను నా సమాధికి వెళ్ళే ముందు, తప్పిపోయిన మీ కుటుంబ సభ్యులను ఎక్కడ కనుగొనాలో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.”
ప్రకాశవంతమైన ఒక వధువు మరియు అందమైన వరుడు ప్రభువు యొక్క మందిరములో ముద్రవేయబడుతున్నారు. అతనిలాగే, ఆమె వయస్సు 70 సంవత్సరాలు. ఒక అందమైన వధువు, ఈ రోజు కోసం యోగ్యతతో ఆమె ఎదురుచూసింది. ఆమె సిగ్గుపడుతూ తన పెళ్లి దుస్తులను ఈ వైపుకు, ఆ వైపుకు ఊపుతోంది. మేము ఆనందభాష్పాలు చిందించాము. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. ఆయన నిబంధనలు ఆశీర్వాదాలను తెస్తాయి.
వితంతువైన ఒక సోదరికి ఇంటివద్ద బోధిస్తున్నప్పుడు, యువ బాయిడ్ కె. పాకర్ ఒక సున్నితమైన పాఠం నేర్చుకున్నాడు. తన భర్తతో విభేదించిన తర్వాత, ఆ సోదరి చివరిగా బాధాకరమైన వ్యాఖ్య చేసింది. ఊహించని ఒక ప్రమాదం ఆ రోజు ఆమె భర్త ప్రాణాలను బలిగొంది. “యాభై సంవత్సరాలుగా,” ఆ వితంతువు ఏడుస్తూ, “అతను నా నోటి నుండి విన్న చివరి మాటలు ఆ కఠినమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు అని తెలిసి నేను నరకంలో జీవించాను” అని చెప్పింది.
యేసు క్రీస్తునందు ఈస్టరు, తెరకు ఇరువైపులా మన సంబంధాలను బాగుచేసుకోవడానికి, సమాధానపరచుకోవడానికి మరియు సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. యేసు దుఃఖాన్ని శాంతింపజేయగలరు; ఆయన క్షమాపణను అందించగలరు. మనము లేదా ఇతరులు చెప్పిన లేదా చేసిన వాటి నుండి ఆయన మనల్ని మరియు ఇతరులను విడిపించగలరు, లేకుంటే అవి మనల్ని బంధిస్తాయి.
యేసు క్రీస్తునందు ఈస్టరు మనకు దేవుని యొక్క సమ్మతిని అనుభూతి చెందేలా చేస్తుంది. మనం చాలా పొడవుగా, చాలా పొట్టిగా, చాలా వెడల్పుగా, చాలా ఇరుకుగా, తెలివి తక్కువగా ఉన్నామని, తగినంత అందంగా లేదా ఆధ్యాత్మికంగా లేమని ఈ ప్రపంచం మనకు చెబుతుంది. యేసు క్రీస్తునందు ఆధ్యాత్మిక పరివర్తన ద్వారా బలహీనపరిచే పరిపూర్ణతావాదం నుండి మనం తప్పించుకోగలము.
ఈస్టరు ఆనందంతో, మనము ఇలా పాడతాము, “మరణం జయించబడింది; మనిషి విముక్తుడయ్యాడు. క్రీస్తు విజయం సాధించారు.” క్రీస్తు యొక్క పునరుత్థానం మనల్ని మరణం నుండి, కాలము యొక్క బలహీనతల నుండి మరియు శారీరక అసంపూర్ణతల నుండి విముక్తులను చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మనల్ని ఆధ్యాత్మికంగా కూడా పునఃస్థాపిస్తుంది. మనల్ని పాపము నుండి మరియు ఎడబాటు నుండి తప్పించడానికి, ఆయన ప్రతి స్వేదరంధ్రము నుండి రక్తము కారింది, ఆయన ఆత్మ శ్రమపడునట్లు రక్తంతో విలపించింది. ఆయన మనల్ని ఒకరినొకరితో మరియు దేవునితో, సంపూర్ణంగా మరియు పరిశుద్ధంగా మళ్ళీ కలుపుతారు. అన్ని మంచి విషయాలలో—ఉన్నదానినే కాకుండా ఉండబోయే దానిని కూడా యేసు క్రీస్తు సమృద్ధిగా పునఃస్థాపిస్తారు.
యేసు యొక్క జీవితం మరియు వెలుగు ఆయన పిల్లలందరి పట్ల దేవునికి గల ప్రేమకు సాక్ష్యమిస్తాయి. మన తండ్రి అయిన దేవుడు ప్రతీ యుగం మరియు దేశంలోని తన పిల్లలందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి, అనేక సాంప్రదాయాలలో మరియు సంస్కృతులలో ఆయనలో శాంతిని, ఆనందాన్ని పొందేందుకు ఆయన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మనం కనుగొంటాము. ఎక్కడైనా, ఎప్పుడైనా, మనం ఎవరమైనా, ఒకే సృష్టికర్త పిల్లలుగా మనం దైవిక గుర్తింపును పంచుకుంటాము. ఇదే స్ఫూర్తితో, ఇస్లాం, యూదా మరియు క్రైస్తవ మత అనుచరులు తండ్రియైన అబ్రాహామునందు మతపరమైన వారసత్వాన్ని మరియు ప్రాచీన ఐగుప్తులోని సంఘటనల ద్వారా నిబంధన సంబంధాన్ని పంచుకుంటారు.
తండ్రియైన అబ్రాహాము ఈజిప్టుకు వచ్చి ఆశీర్వదించబడ్డాడు.
ఫరో కలకు అర్థము, ఏడు సంవత్సరాల సమృద్ధి, ఆ తరువాత ఏడు సంవత్సరాల కరువు అని ఐగుప్తులో బానిసగా అమ్మబడిన యోసేపుకు తెలుసు. యోసేపు తన కుటుంబాన్ని మరియు తన జనులను రక్షించాడు. దేవుని ఉద్దేశ్యాలను తెలుసుకున్నప్పుడు యోసేపు కన్నీళ్లు విడిచాడు, దాని ప్రకారము తమ నిబంధనలను పాటించేవారి మేలుకొరకు సమస్తము సమకూడి జరుగుతుంది.
ఐగుప్తులోని ఫరో ఇంట్లో పెరిగిన మోషే, దేవుని పిల్లలను సమకూర్చడానికి తాళపుచెవులను పొందాడు, ఆ తరువాత వాటిని పునఃస్థాపించాడు.
ప్రవచనము యొక్క నెరవేర్పుగా, యోసేపు, మరియ, శిశువైన క్రీస్తు ఐగుప్తులో ఆశ్రయం పొందారు. కైరోలో, భక్తుడైన ఒక ముస్లిం విశ్వాసి భక్తిపూర్వకంగా ఇలా అంటున్నాడు: “యోసేపు, మరియ మరియు శిశువైన యేసు మా దేశంలో భద్రతను, ఆశ్రయాన్ని పొందారని ఖురాన్ బోధిస్తుంది. నా దేశంలో, యేసు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఆహారాన్ని తిన్నారు, తన మొదటి అడుగులు వేశారు, తన మొదటి మాటలు చెప్పారు. ఇక్కడ నా దేశంలో, ఆయనకు మరియు ఆయన కుటుంబానికి ఫలాలను ఇవ్వడానికి చెట్లు క్రిందికి వంగి ఉంటాయని మేము నమ్ముతాము. ఆయన నా దేశంలో ఉండడం వలన మా జనులు మరియు భూమి దీవించబడ్డాయి.”
దేవుని యొక్క నైతిక మరియు మర్త్య కర్తృత్వ ప్రణాళిక, మన స్వంత అనుభవం ద్వారా నేర్చుకోవడానికి మనల్ని అనుమతిస్తుంది. మన జీవితపు గొప్ప పాఠాలలో కొన్ని మనం ఎన్నటికీ ఎంచుకోని విషయాల నుండి వస్తాయి. ప్రేమతో, యేసు క్రీస్తు అన్నిటికంటే క్రిందికి దిగి వచ్చారు మరియు పైకి ఆరోహణమయ్యారు. సృజనాత్మకత మరియు ఉల్లాసము, ప్రతిఫలం ఆశించని దయ, పశ్చాత్తాపము నిమిత్తము విశ్వాసము మరియు క్షమాపణ వంటి మన దైవిక సామర్థ్యాలను బట్టి ఆయన ఆనందిస్తారు. మరియు ఆయన, తరచుగా మానవ ఎంపిక ద్వారా తీసుకురాబడిన—మానవ బాధల తీవ్రత, క్రూరత్వం, అన్యాయం చూసి కన్నీరు విడిచారు—అలాగే పరలోకములు మరియు వాటితో పాటు పరలోకమందున్న దేవుడు కూడా కన్నీరు విడిచారు.
ప్రతి ఈస్టరు వసంతకాలం, ఆ ఆధ్యాత్మిక క్రమం మరియు కలయిక రెండూ యేసు క్రీస్తు ద్వారా లభించిన ప్రాయశ్చిత్తం, పునరుత్థానం మరియు పునఃస్థాపన యొక్క దైవిక నమూనాలో భాగమని సాక్ష్యమిస్తుంది. ఈ పవిత్రమైన మరియు ప్రతీకాత్మకమైన కలయిక ఆకస్మికముగా లేదా యాదృచ్ఛికంగా సంభవించినది కాదు. మట్టల ఆదివారం, పవిత్ర వారం మరియు ఈస్టరు, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని, పునరుత్థానాన్ని జరుపుకుంటాయి. ఈ రోజులాగే, ప్రతి ఏప్రిల్ 6న మనం యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క స్థాపనను, నిర్మాణమును స్మరించుకుంటాము. మనం ప్రతి ఏప్రిల్లో మొదటి ఆదివారం సర్వసభ్య సమావేశంలో సమకూడడానికి ఈ పునఃస్థాపన ఒక కారణం.
1836, ఈస్టరు ఆదివారం నాడు కొత్తగా ప్రతిష్ఠించబడిన కర్ట్లాండ్ దేవాలయములో పునరుత్థానం చెందిన యేసు క్రీస్తు, మోషే, ఎలియాసు మరియు ఏలీయా యాజకత్వ తాళపుచెవులను మరియు అధికారాన్ని తిరిగి ఇచ్చినప్పుడు కూడా పునఃస్థాపన వచ్చింది. ఆ రోజున ఆ సందర్భములో పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘానికి, ఆయన పిల్లలను సమకూర్చడానికి, ఆయన వద్దకు తిరిగి చేరేలా ఆయన పిల్లలను సిద్ధం చేయడానికి మరియు నిత్యత్వము కోసం కుటుంబాలను ఏకం చేయడానికి దేవుని అధికారం మరియు దీవెనలు వచ్చాయి. ఆ రోజు పునఃస్థాపన, ఈస్టరు మరియు పస్కా రెండింటిలోనూ జరగడం ద్వారా ప్రవచనం నెరవేరింది.
ఇటీవల నేను కర్ట్లాండ్ దేవాలయముతో సహా, ఓహైయోలోని పవిత్ర స్థలాలను సందర్శించాను, అక్కడ ప్రవక్త జోసెఫ్ మరియు ఇతరులు మన తండ్రి అయిన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును దర్శనమందు చూశారు. పరలోకము ఎలా ఉంటుందో ప్రవక్త జోసెఫ్ చూశారు. పరలోకంలో, పరలోక తండ్రి, యేసు క్రీస్తు ద్వారా మహిమ రాజ్యంలో “తన హస్తకృత్యములన్నింటిని రక్షిస్తారు” “తండ్రి బయలుపరచిన తరువాత కుమారుడిని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన” వారు మాత్రం మినహాయింపు.
తన మర్త్య పరిచర్య ప్రారంభమైనప్పుడు, మనలో ప్రతి ఒక్కరినీ—ప్రతి సమయంలో, ప్రతి దేశంలో, ప్రతి పరిస్థితిలో మనం స్వీకరించడానికి ఇష్టపడే ప్రతిదానితో దీవించాలనే తన నియమితకార్యాన్ని యేసు ప్రకటించారు. 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత, యేసు సమాజమందిరంలోకి వెళ్లి ఇలా చదివారు, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, విరిగిన హృదయము గలవారిని స్వస్థపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.”
బీదలు, విరిగిన హృదయం గలవారు, చెరలోనున్నవారు, గ్రుడ్డివారు, గాయపడినవారు—అంటే మనలో ప్రతీ ఒక్కరు.
యెషయా గ్రంథం నిరీక్షణ, విడుదల, హామీ యొక్క మెస్సీయ వాగ్దానాన్ని ఇలా కొనసాగిస్తుంది: “సీయోనులో దుఃఖించువారికి, … బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు.”
ఆ విధంగా, “ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు, కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది” అని మనము కేకలు వేస్తాము.
ప్రతి ఈస్టరు సమయంలో, యేసు క్రీస్తు ద్వారా పొందిన నిత్యత్వము యొక్క గొప్ప బహుమతులు, అనగా ఆయన ప్రాయశ్చిత్తం, ఆయన (మరియు అక్షరాలా మన) పునరుత్థానం యొక్క వాగ్దానం మరియు దేవుని పిల్లలందరినీ ఆశీర్వదించడానికి యాజకత్వ తాళపుచెవులు మరియు అధికారంతో ఆయన యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ పునఃస్థాపనను ప్రతీకాత్మకంగా మనం వేడుక చేసుకుంటాము. మనం రక్షణవస్త్రములను బట్టి మరియు నీతి అను పైబట్టను బట్టి ఆనందిస్తాము. “దేవుడు మరియు గొఱ్ఱెపిల్లకు హోసన్నా!” అని మనము కేక వేస్తాము.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
మనమందరం యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, పునరుత్థానము మరియు పునఃస్థాపనలో— నిజమైన, సంతోషకరమైన మరియు ఆనందకరమైన శాంతిని, యేసులాగా మారడాన్ని మరియు చెందియుండడాన్ని శాశ్వతంగా కనుగొనాలని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.