సర్వసభ్య సమావేశము
మీరు పిలువబడుతున్న ఆ పేరు
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


11:1

మీరు పిలువబడుతున్న ఆ పేరు

క్రీస్తు యొక్క నామముతో పిలువబడుట అంటే ఏమిటి?

ప్రభువు మనతో నేరుగా మాట్లాడుతుంటే, ఆయన మొదటగా మన నిజమైన గుర్తింపును మనం అర్థం చేసుకునేలా నిశ్చయపరుస్తారని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు: మనం దేవుని పిల్లలం, నిబంధన సంతానం మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యులం. మరేదైనా పేరు చివరికి మనల్ని నిరాశపరుస్తుంది.

నా పెద్ద కొడుకు తన మొదటి సెల్ ఫోన్ అందుకున్నప్పుడు నేను స్వయంగా దీన్ని నేర్చుకున్నాను. చాలా ఉత్సాహంతో, అతను పరిచయస్థుల జాబితాలో తన కుటుంబ సభ్యుల పేర్లను మరియు స్నేహితుల పేర్లను నమోదు చేయడం ప్రారంభించాడు. ఒక రోజు, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నట్లు నేను గమనించాను. స్క్రీన్ మీద “అమ్మ” అనే పేరు కనిపించింది. అది తెలివైన మరియు గౌరవప్రదమైన ఎంపిక—నేను ఒప్పుకుంటాను, మా ఇంట్లో మంచి తల్లి పట్ల గౌరవానికి అది సంకేతం. సహజంగానే, నాకు ఆసక్తి కలిగింది. అతను నాకు ఏ పేరు పెట్టాడు?

వెండీ “అమ్మ” అయితే, నేను “నాన్న” అవుతానని ఊహిస్తూ నేను అతని పరిచయస్థుల జాబితా వెదికాను. అక్కడ లేదు. నేను “నాన్న” కోసం వెతికాను. అయినా ఏమీ లేదు. నా ఆసక్తి కాస్తా ఆందోళనగా మారింది. “అతను నన్ను ‘కోరీ’ అని పిలుస్తాడా?” లేదు. చివరి ప్రయత్నంగా, నేను అనుకున్నాను, “మేము సాకర్ ఆటగాళ్లం—బహుశా అతను నన్ను ‘పీలే’ అని పిలుస్తాడేమో.” ఆశగా చూసాను. చివరకు, నేనే అతని నంబర్‌కు ఫోన్ చేసాను మరియు అతని స్క్రీన్‌పై రెండు పదాలు కనిపించాయి: “అమ్మ కాదు”!

సహోదర సహోదరీలారా, మీరు ఏ పేరుతో పిలువబడ్డారు?

యేసు తన అనుచరులను అనేక పేర్లతో పిలిచారు: శిష్యులు. కుమారులు మరియు కుమార్తెలు. ప్రవక్తల పిల్లలు. గొర్రెలు. స్నేహితులు. లోకము యొక్క వెలుగు. పరిశుద్ధులు. ప్రతీ ఒక్కటి నిత్య ప్రాముఖ్యతను కలిగియుంటుంది మరియు రక్షకునితో వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెబుతుంది.

కానీ ఈ పేర్లలో, ఒకటి మిగతా వాటి కంటే చాలా ముఖ్యమైనది—క్రీస్తు పేరు. మోర్మన్ గ్రంథములో, రాజైన బెంజమిన్ శక్తివంతంగా బోధించాడు:

“రక్షణ కలుగజేయుటకు మరేయితర నామము ఇవ్వబడలేదు; కావున, మీరు క్రీస్తు నామమును మీపైన తీసుకొనవలెనని నేను కోరుచున్నాను. …

“దీనిని చేయువాడు దేవుని కుడిపార్శ్వమున కనుగొనబడును, ఏలయనగా తాను పిలువబడియున్న నామమును అతడు ఎరుగును; అతడు క్రీస్తు యొక్క నామము చేత పిలువబడును.”

క్రీస్తు నామాన్ని తమపైన తీసుకునేవారు ఆయన శిష్యులు మరియు సాక్షులు అవుతారు. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత, యేసును విశ్వసించి, బాప్తిస్మం తీసుకొని, పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందుతారని సాక్ష్యమివ్వాలని ఎన్నుకోబడిన సాక్షులు ఆజ్ఞాపించబడ్డారు అని అపొస్తలుల కార్యములలో మనం చదువుతాము. ఈ పవిత్ర విధులను పొందిన వారు సంఘముతో కలిసి సమావేశమై, శిష్యులుగా మారారు మరియు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మోర్మన్ గ్రంథం కూడా క్రీస్తులో నమ్మకముంచేవారిని క్రైస్తవులని మరియు నిబంధన జనులను “క్రీస్తు యొక్క సంతానము, ఆయన కుమారులు మరియు ఆయన కుమార్తెలు” అని వర్ణిస్తుంది.

క్రీస్తు యొక్క నామముతో పిలువబడుట అంటే ఏమిటి? దీని అర్థం నిబంధనలు చేసి పాటించడం, ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు “అన్ని సమయములలో, అన్ని విషయములలో దేవుని సాక్షులుగా నిలబడడానికి ఇష్టపడడం.” దీని అర్థం క్రీస్తు సందేశాన్ని—దాని సిద్ధాంతం, నిబంధనలు మరియు విధులతో పాటు ప్రపంచానికి అందజేస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలులకు మద్దతివ్వడం. దీని అర్థం బాధను తగ్గించడానికి ఇతరులకు సేవ చేయడం మరియు వెలుగుగా ఉండి, జనులందరికీ క్రీస్తు యందు నిరీక్షణను కలిగించడం. అయితే, ఇది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. “ఇది ఏ మానవుడు ఒక్క క్షణంలో చేరుకోలేని గమ్యస్థానం” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు.

శిష్యత్వ ప్రయాణానికి సమయం మరియు “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రంగా” నిర్మించబడిన ప్రయత్నం అవసరం కాబట్టి, లోకసంబంధమైన బిరుదులలో చిక్కుకోవడం సులభం. ఇవి తాత్కాలిక విలువను మాత్రమే ఇస్తాయి మరియు వాటంతట అవే ఎప్పటికీ సరిపోవు. విమోచన మరియు నిత్య విషయాలు “పరిశుద్ధ మెస్సీయ యందు మరియు ఆయన ద్వారానే వస్తాయి.” కాబట్టి, శిష్యత్వాన్ని ప్రాధాన్యతగా చేసుకోవాలనే ప్రవచనాత్మక సలహాను అనుసరించడం సమయోచితమైనది మరియు జ్ఞానయుక్తమైనది, ముఖ్యంగా విభిన్న స్వరాలు మరియు ప్రభావాలు గల యుగంలో. రాజైన బెంజమిన్ చెప్పిన సలహా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే, “మీ హృదయములలో వ్రాయబడిన [క్రీస్తు] నామమును ఎల్లప్పుడు నిలుపుకొనుటకు మీరు జ్ఞాపకముంచుకొనవలెనని, … మీరు పిలువబడు స్వరమును, ఆయన మిమ్ములను పిలుచు ఆ పేరును కూడా మీరు విని ఎరుగవలెనని నేను చెప్పుచున్నాను.”

మార్టిన్ గ్యాస్నర్

నా స్వంత కుటుంబంలోనే నేను దీన్ని చూశాను. వినయపూర్వకమైన శాఖాధ్యక్షుడు రక్షకుని పిలుపుకు సమాధానం ఇచ్చినందున, మా ముత్తాత మార్టిన్ గాస్నర్ శాశ్వతంగా మారిపోయారు. 1909లో జర్మనీలో, పరిస్థితులు కఠినంగా ఉండేవి మరియు డబ్బుకు ఇబ్బందిగా ఉండేది. మార్టిన్ పైపుల తయారీ కర్మాగారంలో వెల్డర్‌గా పనిచేశారు. ఆయన ఒప్పుకున్నట్లుగా, వచ్చిన జీతమంతా మద్యపానం, ధూమపానం మరియు పబ్‌లో పానీయాలు కొనడానికి ఖర్చు చేయబడేది. ఆయన భార్య చివరికి, ఆయన మారకపోతే తాను వెళ్లిపోతానని హెచ్చరించింది.

ఒకరోజు, మార్టిన్ సహోద్యోగి చేతిలో నలిగిన కాగితం పట్టుకుని పబ్‌కి వెళ్ళే దారిలో ఆయన్ని కలిశాడు. అతనికి అది వీధిలో దొరికింది మరియు అతను Was wissen Sie von den Mormonen? [వాస్ విస్సెన్ సై వాన్ డెన్ మోర్మోనెన్?] లేదా మోర్మన్ల గురించి మీకు ఏమి తెలుసు? అనే కరపత్రాన్ని చదివిన తర్వాత తనకు ఏదో భిన్నంగా అనిపించిందని మార్టిన్‌తో చెప్పాడు. ఆ శీర్షిక మారిందని నాకు ఖచ్చితంగా తెలుసు.

సంఘం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి దాని వెనుక భాగంలో ముద్రించిన చిరునామా స్పష్టంగా ఉంది. అది చాలా దూరంలో ఉంది, కానీ వారు చదివిన దానితో వారు ప్రేరేపించబడ్డారు మరియు ఆ ఆదివారం రైలులో వెళ్ళి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ చిరునామా వారు ఆశించిన సంఘానిది కాదని, అంత్యక్రియల గృహానిది అని వారు కనుగొన్నారు. మార్టిన్ సంకోచించారు—ఎందుకంటే నిజంగా, అంత్యక్రియల గృహంలో సంఘం ఉండడం రెండు విషయాలను ఒకేచోట అందిస్తున్నట్లు వింతగా ఉంది.

కానీ మేడమీద, ఒక అద్దె గదిలో, పరిశుద్ధుల చిన్న గుంపును వారు కనుగొన్నారు. ఒక వ్యక్తి వారిని సాక్ష్యపు సమావేశానికి ఆహ్వానించాడు. మార్టిన్ ఆత్మచేత ప్రభావితమయ్యారు మరియు సరళమైన, ఉత్సాహభరితమైన సాక్ష్యాలతో ఎంతగానో ఆకట్టుకోబడి, ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అక్కడే, ఆ అత్యంత అసంభవమైన ప్రదేశంలో, అది నిజమని తనకు ఇదివరకే తెలుసునని ఆయన చెప్పారు.

తరువాత, ఆ వ్యక్తి తనను తాను శాఖాధ్యక్షుడిగా పరిచయం చేసుకుని, వారు తిరిగి వస్తారా అని అడిగాడు. తాను చాలా దూరంలో నివసిస్తున్నాడని మరియు ప్రతీ వారం ప్రయాణించే స్థోమత లేదని మార్టిన్ వివరించారు. శాఖాధ్యక్షుడు, “నన్ను అనుసరించండి” అని అన్నాడు.

వారు కొంత దూరం నడిచి దగ్గరలోని కర్మాగారానికి వెళ్లారు, అక్కడ శాఖాధ్యక్షుని స్నేహితుడు పనిచేస్తున్నాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, మార్టిన్ మరియు ఆయన స్నేహితుడికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. తరువాత, శాఖాధ్యక్షుడు వారిని ఒక అపార్ట్‌మెంట్ భవనానికి తీసుకువెళ్లి వారి కుటుంబాల కొరకు ఇల్లు ఏర్పాటు చేసాడు.

ఇదంతా రెండు గంటల్లోనే జరిగింది. మార్టిన్ కుటుంబం మరుసటి వారం అక్కడికి వెళ్లారు. ఆరు నెలల తర్వాత, వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఒకప్పుడు నిరాశాజనకమైన తాగుబోతుగా పేరుగాంచిన వ్యక్తి తన కొత్త విశ్వాసంపై ఎంతగా మక్కువ పెంచుకున్నాడంటే, పట్టణంలోని ప్రజలు ఆయన్ని, బహుశా అంత ప్రేమగా కాకపోయినా, “యాజకుడు” అని పిలవడం ప్రారంభించారు.

శాఖాధ్యక్షుని విషయానికొస్తే, నేను అతని పేరు చెప్పలేను—అతని గుర్తింపు కాలక్రమేణా మరుగున పడింది. కానీ నేను అతన్ని శిష్యుడు, రాయబారి, క్రైస్తవుడు, మంచి సమరయుడు మరియు స్నేహితుడు అని పిలుస్తాను. 116 సంవత్సరాల తరువాత కూడా అతని ప్రభావం అనుభూతి చెందబడుతోంది మరియు నేను అతని శిష్యత్వం నుండి లాభం పొందుతున్నాను.

దేవాలయము వద్ద గ్యాస్నర్‌లు

“ఒక ఆపిల్‌లో ఉన్న విత్తనాలను మీరు లెక్కించగలరు, కానీ ఒక విత్తనమునుండి వచ్చే ఆపిల్ పండ్లను మీరు లెక్కించలేరని ఒక సామెత ఉంది.” శాఖాధ్యక్షుడు నాటిన విత్తనం లెక్కలేనన్ని ఫలాలను ఇచ్చింది. 48 సంవత్సరాల తరువాత, మార్టిన్ కుటుంబంలోని అనేక తరాలు తెరకు ఇరువైపులా బెర్న్ స్విట్జర్లాండ్ దేవాలయంలో ముద్రవేయబడతాయని అతను ఊహించియుండకపోవచ్చు.

గొప్ప ప్రసంగాలు బహుశా మనం ఎప్పుడూ విననివి, కానీ యేసులా ఉండేందుకు ప్రయత్నిస్తూ, మేలు చేయుచు సంచరించే సాధారణ ప్రజల జీవితాల్లో గమనించబడిన నిశ్శబ్ద, నిరాడంబరమైన చర్యలు మరియు పనులలో మనం చూసేవి అయ్యుండవచ్చు. దయగల ఈ శాఖాధ్యక్షుడు చేసింది పనుల జాబితాలో భాగం కాదు. అతను కేవలం ఆల్మా గ్రంథంలో వివరించిన విధంగా సువార్తను జీవిస్తున్నాడు: “వారు ఆకలిదప్పులతోనున్న వారిని, రోగులను, … వెళ్ళగొట్టలేదు, … వారు వృద్ధులు యౌవనులు, … పురుషులు స్త్రీలు అందరి యెడల ఉదారముగానుండిరి.” మరియు మనం విస్మరించకూడని ఒక విషయం ఏమిటంటే, వారు “సంఘము వెలుపలనేమి, సంఘమందేమి” ఎవ్వరినీ వెళ్ళగొట్టలేదు.

క్రీస్తు నామాన్ని తమపైన తీసుకున్నవారు, జోసెఫ్ స్మిత్ చెప్పినట్లుగా ఇలా గుర్తిస్తారు, “దేవుని ప్రేమతో నిండిన మనిషి, తన కుటుంబాన్ని మాత్రమే ఆశీర్వదించడంతో సంతృప్తి చెందడు, కానీ మొత్తం మానవ జాతిని ఆశీర్వదించాలనే ఆత్రుతతో ప్రపంచం అంతటా తిరుగుతాడు.”

యేసు ఇలానే జీవించారు. నిజానికి, ఆయన చాలా చేసారు, ఆయన శిష్యులు వాటన్నింటినీ వ్రాయలేకపోయారు. అపొస్తలుడైన యోహాను ఇలా నమోదు చేశాడు: “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.”

మంచి చేయడానికి మరియు శిష్యత్వాన్ని జీవితకాల ప్రాధాన్యతగా చేసుకోవడం ద్వారా క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించడానికి కృషి చేద్దాం, తద్వారా మనం ఇతరులతో సంభాషించే ప్రతిసారీ, వారు దేవుని ప్రేమను మరియు పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారణ శక్తిని అనుభవించగలుగుతారు. అప్పుడు, శిష్యుడైన అంద్రెయ లాగా, “మేము మెస్సీయను కనుగొంటిమి” అని ప్రకటించిన మా ముత్తాతతో మరియు లక్షలాదిమంది ఇతరులతో మనం చేరవచ్చు.

చివరికి, మన గుర్తింపు ప్రపంచం ద్వారా నిర్వచించబడదు. కానీ మన శిష్యత్వం మనం పొందే విధులు, మనం పాటించే నిబంధనలు మరియు మంచి చేయడం ద్వారా దేవునికి, పొరుగువారికి మనం చూపించే ప్రేమ ద్వారా నిర్వచించబడుతుంది. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, మనం దేవుని పిల్లలం, నిబంధన సంతానం మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యులం.

యేసు క్రీస్తు సజీవుడని మరియు మనల్ని విమోచించారని నేను సాక్ష్యమిస్తున్నాను. “పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను … నీవు నా సొత్తు” అని చెప్పినది ఆయనే. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.