“పునఃస్థాపన స్వరములు: ‘దర్శనము’ యొక్క సాక్ష్యములు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“‘దర్శనము’ యొక్క సాక్ష్యములు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
పునఃస్థాపన స్వరములు: “దర్శనము” యొక్క సాక్ష్యములు
విల్ఫర్డ్ ఉడ్రఫ్
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్లు సిద్ధాంతము మరియు నిబంధనలు 76లో నమోదు చేయబడిన దర్శనమును పొందిన తర్వాత, దాదాపు రెండు సంవత్సరాలకు 1833, డిసెంబరులో విల్ఫర్డ్ ఉడ్రఫ్ సంఘములో చేరారు. ఆ సమయంలో ఆయన న్యూయార్క్లో నివసిస్తూ, ఆ ప్రాంతంలో సేవచేస్తున్న సువార్తికుల నుండి “దర్శనము” గురించి తెలుసుకున్నారు. చాలాకాలం తర్వాత, ఈ బయల్పాటు గురించి ఆయన భావాలను ఆయనిలా చెప్పారు:
“నా చిన్నతనం నుండి ఒక స్వర్గము, ఒక నరకము ఉన్నదని నేను బోధించబడ్డాను మరియు దుష్టులందరికి ఒక శిక్ష, నీతిమంతులందరికి ఒక మహిమ ఉన్నదని చెప్పబడ్డాను. …
“… నేను దర్శనమును చదివినప్పుడు … , అది నా మనస్సును వెలిగించి, నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది, ఆ సూత్రాన్ని మనిషికి బయల్పరచిన దేవుడు వివేకవంతుడని, న్యాయవంతుడని, సత్యమును, మంచి సుగుణాలను, మంచి తెలివితేటలను మరియు జ్ఞానమును కలిగియున్నాడని నాకు అనిపించింది, ప్రేమ, కనికరము, న్యాయము మరియు తీర్పునందు ఆయన స్థిరముగా ఉన్నారని నేను భావించాను మరియు నా జీవితంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రభువును ప్రేమించాలని నేను భావించాను.”
“‘దర్శనము‘ అనేది ఒక బయల్పాటు, అది మేము ఇంతకుముందు చదివిన పుస్తకాలన్నిటిలో ఉన్న బయల్పాటు కంటే అధిక జ్ఞానాన్ని, అధిక సత్యాన్ని మరియు అధిక సూత్రాన్ని ఇస్తుంది. అది మన ప్రస్తుత పరిస్థితిని, మనము ఎక్కడ నుండి వచ్చాము, మనము ఇక్కడ ఎందుకు ఉన్నాము మరియు మనము ఎక్కడికి వెళ్తున్నాము అని స్పష్టంగా గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. ఆ బయల్పాటు ద్వారా ఏ వ్యక్తి అయినా తన పాత్ర ఏమిటో మరియు తన పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవచ్చు.”
“జోసెఫ్ను చూడడానికి ముందు నేను ఇలా చెప్పాను, ఆయన ఎంత పెద్దవాడు లేదా ఎంత చిన్నవాడు అనేది నాకు అనవసరము; ఆయన చూడడానికి ఎలా ఉంటాడు—ఆయన జుట్టు పొడవుగా ఉంటుందా లేదా పొట్టిగా ఉంటుందా అనేది నాకు అనవసరము; ఆ బయల్పాటును [76వ ప్రకరణములో నమోదు చేయబడిన దర్శనము] ముందుకు తెచ్చిన మనిషి దేవుని యొక్క ప్రవక్త. అది నాకై నేను ఎరుగుదును.”
ఫీబి క్రాస్బి పెక్
“దర్శనము” గురించి జోసెఫ్ మరియు సిడ్నీలు బోధించడం వినినప్పుడు ఫీబి పెక్ మిస్సోరిలో నివసిస్తోంది మరియు ఒంటరి తల్లిగా ఐదుగురు పిల్లలను పెంచుతోంది. దర్శనము ఎంతగా ఆమె మనస్సులో నాటుకొని ప్రేరేపించినదనగా, ఆమె నేర్చుకున్న దానిని తన కుటుంబంతో పంచుకోవడానికి ఆమె క్రింది విధంగా వ్రాసింది:
“ప్రభువు పరలోక రాజ్యపు మర్మములను తన పిల్లలకు బయల్పరుస్తున్నారు. … గత వసంతకాలంలో జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్లు మమ్మల్ని దర్శించారు, వారు ఇక్కడ ఉన్నప్పుడు మేము అనేక ఆనందకరమైన సమావేశాలు కలిగియున్నాము మరియు మా దృష్టి యందు దేవుని మర్మములు అనేకము విశదము చేయబడ్డాయి, అది నాకు గొప్ప ఓదార్పునిచ్చింది. ఆయన పిల్లల కొరకు శాంతి నివాసాలను సిద్ధం చేయడంలో దేవుని నమ్రతను మేము చూడగలిగాము. ఎవరైతే సువార్త యొక్క సంపూర్ణతను పొందక, క్రీస్తు యొక్క హేతువులో శూరులైన సైనికులుగా నిలబడకయుందురో, వారు తండ్రి మరియు కుమారుని సన్నిధిలో నివసించలేరు. దానిని పొందని వారందరి కొరకు ఒక స్థలము సిద్ధపరచబడినది, కానీ సిలెస్టియల్ రాజ్యములో నివసించడం కంటే చాలా తక్కువ మహిమ గల ప్రదేశమది. ఈ విషయాల గురించి ఇంకా చెప్పడానికి నేను ప్రయత్నించకూడదు, ఎందుకంటే అవి ఇప్పుడు ముద్రించబడి, లోకంలోకి వెళ్ళబోతున్నాయి. బహుశా మీకై మీరు చదివే అవకాశాన్ని మీరు కలిగియుంటారు మరియు ఒకవేళ మీరు చదివినట్లయితే, శ్రద్ధగల ప్రార్థనాపూర్వక హృదయంతో మీరు చదువుతారని నేనాశిస్తున్నాను, ఎందుకంటే ఈ విషయాలు గమనించ యోగ్యమైనవి. వాటిని మీరు చదివి, ధ్యానించాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఈ లోకంలో మరియు రాబోయే లోకంలో మన సంతోషానికి దారితీసేవి అవే.”